నిజంనిప్పులాంటిది

Mar 28 2023, 07:20

Kotam Reddy: నెల్లూరు జిల్లాలో పది స్థానాలూ గెలుస్తాం: కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డి..

అనంతపురం: రానున్న ఎన్నికల్లో నెల్లూరు జిల్లా (Nellore District)లో పది స్థానాల్లోనూ టీడీపీ (TDP) విజయం సాధిస్తుందని టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డి (Kotam Reddy Giridhar Reddy) అన్నారు.

టీడీపీలో చేరిన తాను, సామాన్య కార్యకర్తలా స్థానిక నాయకులందరితో కలిసి పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తానని అన్నారు. శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండల కేంద్ర సమీపంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ (NaraLokesh)ను సోమవారం ఆయన కలిశారు. యువగళం పాదయాత్రకు సంఘీబావం తెలిపారు. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడుతూ...

తమ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ చేపట్టిన యువగళం పాదయాత్రను అన్నివర్గాల ప్రజలు ఆదరిస్తున్నారని అన్నారు. ప్రజల ఆదరణ ఉన్నంత వరకూ టీడీపీని ఎవరూ అడ్డుకోలేరని అన్నారు. ఎవరెన్ని ఆంక్షలు పెట్టినా యువగళం జనప్రభంజనంలా సాగిపోతుందని పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో ఎలాంటి ఇబ్బందులనూ లెక్కచేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

తాను తెలుగుదేశం పార్టీలో సామాన్య కార్యకర్తగానే చేరానని అన్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, లోకేశ్‌ ఆదేశాలతో, వారు ఏం చెబితే ఆ పని చేసేందుకు సిద్ధంగా ఉన్నానని అన్నారు. తన సోదరుడు, నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి (Kotam Reddy Sridhar Reddy)ని వైసీపీ కొత్తగా సస్పెండ్‌ చేసేదేమీ లేదని అన్నారు. తాము అంతకుముందు రెండు నెలలుగా ఆ పార్టీకి దూరంగా ఉన్నామని అన్నారు. నియోజకవర్గ సమస్యలను పరిష్కరించకపోవడం, ఫోన్‌ ట్యాపింగ్‌ నేపథ్యంలో తాము జగన్‌తో ఉండకూడదని నిర్ణయించుకున్నామని అన్నారు..

నిజంనిప్పులాంటిది

Mar 28 2023, 07:19

TTD: తితిదేకి రూ.3 కోట్ల జరిమానా

తిరుమల: విదేశీ మారకద్రవ్యానికి సంబంధించిన అంశంపై తితిదే (TTD)కి ఆర్బీఐ రూ.3 కోట్ల జరిమానా వేసిందని ఛైర్మన్‌ సుబ్బారెడ్డి (Subbareddy) తెలిపారు..

ఆర్బీఐ (RBI) వేసిన జరిమానా చెల్లించినట్లు వెల్లడించారు. భక్తులు హుండీలో వేసిన విదేశీ కరెన్సీని బ్యాంకులో జమచేసే సమయంలో విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (ఎఫ్‌సీఆర్‌ఏ) నిబంధనలు ఉల్లంఘించినందుకు జరిమానా విధించినట్లు తెలిపారు.

తితిదేకు ఉన్న ఎఫ్‌సీఆర్‌ఏ లైసెన్స్‌ 2018తో ముగిసింది. అయితే, ఇప్పటి వరకు దానిని రెన్యువల్‌ చేయకపోవడంతోనే సమస్య తలెత్తిందని సుబ్బారెడ్డి తెలిపారు. ఇప్పటికే రెండు విడతల్లో రూ.3కోట్ల జరిమానా చెల్లించినందున.. లైసెన్సును రెన్యువల్‌ చేయాలని ఆర్బీఐకి కోరినట్లు చెప్పారు. హుండీ కానుకల ద్వారా రూ.30 కోట్ల విలువైన విదేశీ కరెన్సీ వచ్చిందన్నారు..

నిజంనిప్పులాంటిది

Mar 28 2023, 07:17

MLC kavitha: ఎమ్మెల్సీ కవిత పిటిషన్‌పై సుప్రీంలో విచారణ.. 3 వారాలకు వాయిదా..

దిల్లీ : మద్యం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) తనకు సమన్లు జారీ చేయడాన్ని సవాల్‌ చేస్తూ భారాస ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన రిట్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది..

గతంలో దాఖలు చేసిన నళినీ చిదంబరం పిటిషన్‌కు ఈ కేసును ట్యాగ్‌ చేసిన సర్వోన్నత న్యాయస్థానం.. కేసు విచారణను 3 వారాలకు వాయిదా వేసింది. మహిళలను ఈడీ ఆఫీస్‌కు పిలిచి విచారణ జరిపే విషయంలో గతంలో నళినీ పిటిషన్‌ దాఖలు చేశారు..

దీనిపై అత్యవసర విచారణ చేపట్టాలని ఆమె తరఫు న్యాయవాదులు 15న సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ ధర్మాసనం ముందు మెన్షన్‌ చేశారు. సీజేఐ అందుకు తిరస్కరించి ఈ నెల 24న విచారిస్తామని చెప్పారు. కానీ ఆరోజు కేసు విచారణకు రాలేదు. నేడు జస్టిస్‌ అజయ్‌రస్తోగి, జస్టిస్‌ బేలా ఎం.త్రివేది ధర్మాసనం ముందు లిస్ట్‌ చేయగా.. ధర్మాసనం విచారణ చేపట్టింది..

నిజంనిప్పులాంటిది

Mar 27 2023, 14:02

India Corona: 10,000 దాటిన క్రియాశీల కేసులు.. 134 రోజుల తర్వాత ఇదే అత్యధికం..

దిల్లీ: దేశంలో కరోనా వైరస్(Coronavirus) గుబులు ఇంకా తొలగిపోలేదు. కొత్త కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. సోమవారం కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం..

24 గంటల వ్యవధిలో 56,551 మందిని పరీక్షించగా..1,805 మందికి వైరస్‌ సోకినట్లు తేలింది. ముందురోజు కూడా ఇదేస్థాయి(1,890)లో కేసులు వచ్చాయి. రోజువారీ పాజిటివిటీ రేటు 3.19 శాతంగా ఉంది..

కొత్త కేసులు పెరుగుతుండటంతో క్రియాశీల కేసులు(Active Covid cases) 10వేల మార్కు దాటాయి. 134 రోజుల తర్వాత ఇదే అత్యధికం కావడం గమనార్హం. నిన్న ఆరుగురు మరణించారు. ఇప్పటివరకూ 4.47 కోట్ల మందికి కరోనా సోకగా.. 5.30 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. రికవరీ రేటు 98.79 శాతంగా నమోదైంది..

నిజంనిప్పులాంటిది

Mar 27 2023, 14:00

వైఎస్ వివేకా హత్య కేసులో సిబిఐ తీరుపై సుప్రీం ఆగ్రహం..

ఆంధ్ర ప్రదేశ్ లో నాలుగేళ్ల క్రితం జరిగిన వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తు అంతకంతకు ఆలస్యం అవుతుంది. ఈ నాలుగేళ్లలో కరోనాతో పాటు ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్న సిబిఐ..

ఇప్పటికీ దర్యాప్తును కొలిక్కి తీసుకురాలేకపోతుంది. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టులో ఇవాళ కీలక పరిణామం చోటు చేసుకుంది. వివేకా కేసులో సీబీఐ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు.

విచారణ అధికారిని తక్షణమే మార్చివేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న శివశంకర్ రెడ్డి భార్య తులసమ్మ పిటిషన్ పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు స్టేటస్ రిపోర్ట్ లో ఎలాంటి పురోగతి లేదని, దర్యాప్తును మరింత వేగవంతం చేయాలని ఆదేశించింది. అలాగే విచారణ అధికారి రాంసింగ్ ను మార్చివేయాలని జస్టిస్ ఎం ఆర్ షా సిబిఐకి సూచించారు..

నిజంనిప్పులాంటిది

Mar 26 2023, 20:04

Rain Alert: తెలంగాణలో రెండ్రోజులు వర్షాలు.. 3 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

హైదరాబాద్‌: తెలంగాణ వ్యాప్తంగా రెండ్రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఉమ్మడి వరంగల్‌, ఖమ్మం, నల్గొండ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ హెచ్చరికలు జారీ చేసింది..

రాష్ట్రంలోని పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ ఓ ప్రకటనలో పేర్కొంది.

ఇవాళ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, సోమవారం ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది..

నిజంనిప్పులాంటిది

Mar 26 2023, 20:03

Nikhat Zareen: నిఖత్‌ జరీన్‌ పసిడి పంచ్‌.. వరుసగా రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌!

దిల్లీ: మహిళల ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌(wWBC)లో భారత్‌ స్వర్ణాల పంట పండిస్తోంది. ఇప్పటికే రెండు బంగారు పతకాలు కైవసం చేసుకున్న భారత్..

తాజాగా మరో స్వర్ణాన్ని తన ఖాతాలో వేసుకుంది. 50 కిలోల విభాగంలో తెలంగాణ సంచలనం నిఖత్‌ జరీన్‌ (Nikhat Zareen) పసిడి కొల్లగొట్టింది.

ప్రత్యర్థి, రెండు సార్లు అసియా ఛాంపియన్‌షిప్‌ గెలుచుకున్న వియత్నాంకు చెందిన గుయెన్‌ టాన్‌పై 5-0తో విజయం సాధించింది. నిఖత్‌ జరీన్‌ వరుసగా రెండో ఏడాది ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచి అదరగొట్టింది..

నిజంనిప్పులాంటిది

Mar 26 2023, 20:01

Planes Almost Collide: గాల్లోనే రెండు విమానాలు ఢీకొనబోయి...తృటిలో...

న్యూఢిల్లీ: తృటిలో గగనతలంలో భారీ ప్రమాదం తప్పింది. రెండు విమానాలు గాలిలోనే ఢీకొనబోయి సకాలంలో రాడార్ హెచ్చరిక సంకేతాలతో తప్పించుకున్నాయి..

దీంతో గగనతలంలో భారీ ప్రమాదం తప్పినట్టయింది. సంఘటన వివరాల ప్రకారం, నేపాల్ ఎయిర్‌లైన్స్‌ (Nepal Airlines)కు చెందిన ఎయిర్‌బస్ A-320 కౌలాలంపూర్ నుంచి ఖాట్మండూ వస్తుండగా, ఎయిర్ ఇండియా (Air India) విమానం న్యూఢిల్లీ నుంచి ఖాట్మండూ వస్తోంది. రెండూ దాదాపు దగ్గరగా వచ్చాయి. ఆ సమయంలో ఎయిర్ ఇండియా విమానం 19 వేల అడుగుల ఎత్తునుంచి కిందకు దిగుతోంది. నేపాల్ ఎయిర్ లైన్స్ విమానం అదే ప్రదేశంలో 15 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తోంది. దీనిపై రాడార్ సంకేతాలు ఇవ్వడంతో ఇరు విమానాల పైలట్లు అప్రమత్తమయ్యారు. నేపాల్ విమానం వెంటనే ఏడు వేల అడుగులకు దిగడంతో ప్రమాదం తప్పిందని నేపాల్ ఎయిర్‌లైన్స్ ప్రతినిధి ఒకరు తెలిపారు.

కాగా, ఈ ఘటనపై దర్యాప్తునకు ముగ్గురు సభ్యులతో విచారణ కమిటీని నేపాల్ పౌర విమానయాన సంస్థ ఏర్పాటు చేసింది. ఘటనా సమయంలో కంట్రోల్ రూమ్ ఇన్‌చార్జులుగా ఉన్న ముగ్గురు అధికారులపై సివిల్ ఏవియేషన్ అథారిటీ ఆఫ్ నేపాల్ (CANN) సస్పె్న్షన్ వేటు వేసింది. విధినిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ వారిపై చర్య తీసుకున్నట్టు సీఏఏఎన్ ప్రతినిధి ఒక ట్వీట్‌లో తెలిపారు.

నిజంనిప్పులాంటిది

Mar 26 2023, 17:01

కర్ణాటకలోని బసవ కళ్యాణ్ సభకు ఏపీ మిథున్ రెడ్డి

•బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తో కలిసి కార్యక్రమానికి హాజరు

కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదివారం కర్నాటకలో పర్యటించారు. బీదర్ జిల్లా బసవ కళ్యాణ్ తాలుకాలోని గోర్ట గ్రామంలో నిజాంపై పోరాడిన అమరవీరుల స్థూపాన్ని, సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహన్ని ఆవిష్కరించనున్నారని ఏపీ మిథున్ రెడ్డి తెలిపారు.

1948లో ఈ గ్రామంలో రజా కార్లు 200 మందిని ఊచకోత కోసారని, దీన్ని జలియన్ వాలా బాగ్ ఘటనతో అక్క డి పబ్లిక్ పోలుస్తుంటారని ఆన్నారు. బీజేపీ కార్య కర్తలు, అభిమానులు హాజరై అమిత్ షా ప్రో గ్రాంను సక్సెస్ చేయాలని పార్టీ శ్రేణు లను బీజేపీ స్టేట్ చీఫ్​ సంజయ్ సూచించారని, ఆయన పిలుపును అందుకొని నేడు ఆయన వెంట కార్యక్రమానికి తరలి వెళ్ళినట్టు మిథున్ రెడ్డి మీడియాకు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు లంకల దీపక్, గడిల శ్రీకాంత్, గోపి, అనిల్, సంగప్ప, బూనేటి కిరణ్, తోకల శ్రీనివాస్, సుధాకర్ రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు..

నిజంనిప్పులాంటిది

Mar 26 2023, 17:03

కాంగ్రెస్‌లో చేరిన డీ.శ్రీనివాస్..

 •కొడుకుతో కలిసి చేరుతున్నట్టు ప్రకటన 

హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత డీ.శ్రీనివాస్ తిరిగి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. వీల్‌చైర్‌లో గాంధీభవన్‌కు వచ్చిన డీఎస్ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ లో తిరిగి చేరుతుండటం ఎంతో ఆనందంగా ఉందని, సొంత ఇంటికి వచ్చినట్లు ఉందని అన్నారు. తన పెద్దకొడుకు ధర్మపురి సంజయ్‌తో కలిసి పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. అలాగే మరో నేత మేడ్చల్ సత్యనారాయణ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు.

ఏఐసీసీ ఇంచార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, మాజీ పీసీసీ అధ్యక్షుడు వి.హనుమంతరావు డీఎస్‌కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా డీఎస్‌కు ఎంపీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, జానారెడ్డి, షబ్బీర్ అలీ, అంజన్ కుమార్ యాదవ్, పొన్నాల లక్ష్మయ్య, రేణుకా చౌదరి, ఇతర ముఖ్య నేతలు పార్టీలోకి ఆహ్వానించారు.

కాగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై అనర్హత వేటుకు నిరసనగా ఆదివారం గాంధీ భవన్‌లో రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, వి.హెచ్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, సంపత్ కుమార్, కోదండ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి, రేణుకా చౌదరి, స్థానిక నేతలు దీక్ష చేపట్టారు. సాయంత్రం 5గంటల వరకు ఈ దీక్ష కొనసాగనుంది..